కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు.. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఆదేశం!

  • మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు
  • ఇప్పటికే నాలుగుసార్లు విచారణ
  • తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే అవినాశ్ కు నోటీసులు 
  • నేడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

వివేకా హత్య కేసులో అవినాశ్ ‌రెడ్డిని సీబీఐ ఇప్పటి వరకు నాలుగుసార్లు విచారించింది. ఇప్పుడు మరోమారు పిలవడంతో విచారణ తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది. 

పులివెందులలో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్ తరలించి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

YSRCP
YS Avinash Reddy
YS Bhaskar Reddy
CBI
Viveka Murder Case

More Telugu News